తాజాగా భారత్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం వినోదరంగంలో పాకిస్థాన్కు పెద్ద ఎదురుదెబ్బ ఇస్తోంది. సైనికంగా కాదు, ఇప్పుడు సాఫ్ట్వేర్ యుద్ధమే! వినోద రంగంలోనూ భారత్ కఠినమైన చర్యలకు దిగిపోయింది.
ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రపంచాన్ని ఒక్కటిగా చేసిన వేళ, భాషా బంధాలు కరుగుతున్న వేళ… భారత్ మాత్రం జాతీయ భద్రత పేరుతో ఓ దృఢమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ మూలాలున్న వెబ్ సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు ఇకపై భారత భూభాగంలో చొరబడే అవకాశం లేదు.
“జాతీయ భద్రతే ముద్దు!” అనే ధోరణిలో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ ఓటీటీ వేదికలకు స్పష్టమైన సూచనలతో ప్రకటన విడుదల చేసింది.
‘జాతీయ భద్రత దృష్ట్యా పాకిస్థాన్ మూలాలున్న ఓటీటీ కంటెంట్, ఓటీటీ వేదికలు, మీడియా స్ట్రీమింగ్ ఫ్లాట్ఫాంలు, మధ్యవర్తిత్వం ద్వారా అయ్యే ఏ ప్రసారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం. పాకిస్థాన్ వెబ్సిరీస్లు, సినిమాలు, పాటలు, పాడ్కాస్ట్లు సహా మీడియా కంటెంట్ ఏదీ ఇక భారత్లో అందుబాటులో ఉండదు.
సబ్స్క్రిప్షన్, సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికీ ఇందులో ఏ మినహాయింపు లేదు. ఓటీటీ వేదికలు పాకిస్థాన్ కంటెంట్ను భారత్లో స్ట్రీమింగ్ చేయడానికి వీల్లేదు’ అని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశించింది. తాజా నిర్ణయంతో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జియో సినిమా సహా అన్ని ఓటీటీ వేదికలు పాక్ కంటెంట్ స్ట్రీమింగ్ను భారత్లో నిలిపివేయాల్సిందే!